ప్రపంచంలోనే అత్యంత వేడి నగరాల్లో ఒకటిగా మంచిర్యాల

  • ప్రపంచంలోనే అత్యంత వేడి నగరాల జాబితాలో 14వ స్థానంలో మంచిర్యాల
  • మంచిర్యాలలో అత్యధికంగా 43.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు
  • అటవీ విస్తీర్ణం తగ్గడమే ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణమంటున్న నిపుణులు
  • హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లోనూ 41 డిగ్రీలు దాటిన ఎండలు
తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండల తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే,  మంచిర్యాల ప్రపంచంలోనే అత్యంత వేడి నగరాల్లో ఒకటిగా నిలిచింది. అమెరికాకు చెందిన ప్రముఖ వాతావరణ సంస్థ 'ఎల్డోరాడో వెదర్' తాజాగా రూపొందించిన ప్రపంచంలోని 100 అత్యంత వేడి నగరాల జాబితాలో మంచిర్యాల 14వ స్థానంలో నిలవడం గమనార్హం.

సోమవారం (ఏప్రిల్ 20) మంచిర్యాలలో 43.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఎల్డోరాడో వెదర్ జాబితాలో మహారాష్ట్రలోని అకోలా 45 డిగ్రీలతో అగ్రస్థానంలో ఉంది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలను పరిశీలిస్తే.. కొత్తగూడెం, గద్వాలలో 43.3, నిర్మల్, నిజామాబాద్‌లలో 43.0 డిగ్రీల చొప్పున గరిష్ఠ‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రాంతంలో ఎండలు ఇంత తీవ్రంగా ఉండటానికి భౌగోళిక కారణాలతో పాటు అటవీ విస్తీర్ణం తగ్గడమే ప్రధాన కారణమని వాతావరణ శాఖ (ఐఎండీ) శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. మహారాష్ట్రలోని విదర్భ సరిహద్దులో ఉండటం వల్ల, మధ్య భారతం నుంచి వీచే పొడి, వేడి గాలులు ఇక్కడ ఉష్ణోగ్రతలను అమాంతం పెంచుతున్నాయి. దీనికి తోడు 2021లో 18,561 చదరపు కిలోమీటర్లుగా ఉన్న తెలంగాణ అటవీ విస్తీర్ణం, 2023 నాటికి 18,456 చదరపు కిలోమీటర్లకు తగ్గింది. ప్రధానంగా ఆదిలాబాద్, కొత్తగూడెం, ఆసిఫాబాద్ జిల్లాల్లో పచ్చదనం తగ్గడం వల్లే సహజసిద్ధమైన చల్లదనం లోపించి హీట్ వేవ్స్ తీవ్రత పెరుగుతోందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

మరోవైపు రాజధాని హైదరాబాద్‌లోని పట్టణ ప్రాంతాలు కూడా గ్లోబల్ హీట్ లిస్టులో చేరుతున్నాయి. మూసీ నది పరీవాహక ప్రాంతం కావడం, వేగంగా జరుగుతున్న పట్టణీకరణ, భూగర్భ జలాలు పడిపోవడం వల్ల ఇక్కడ వేడి ఎక్కువగా ట్రాప్ అవుతోంది. నగరంలోని న్యూ నాగోల్ ప్రాంతంలో 41.7 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా, ముషీరాబాద్‌లో 41.6, అంబర్‌పేటలో 41.4, మల్కాజిగిరి, ఎల్బీనగర్ ప్రాంతాల్లో 41.3, మెహదీపట్నంలో 41.1 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

రాష్ట్రవ్యాప్తంగా పగటిపూట ఎండలు దంచికొడుతున్నా.. రానున్న 24 గంటల్లో కొన్ని చోట్ల ఊరట లభించే అవకాశం ఉంది. నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్, హనుమకొండ, వికారాబాద్, మెదక్, మేడ్చల్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో సాయంత్రం వేళ ఉరుములు, మెరుపులతో కూడిన గాలివాన కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే, పగటి పూట ఎండ తీవ్రత మాత్రం 40 నుంచి 45 డిగ్రీల మధ్యే కొనసాగే ప్రమాదం ఉందని, బయటకు వచ్చే ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

Adilabad
Hottest Cities
43 Degree Celsius
Heatwave
Telangana

More Telugu News